పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ
Published Monday, 26 September 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/26p7_0.jpg?itok=2ZapHfMR)
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి వార్షిక సిరిమాను ఉత్సవాల వేడుకలకు సంప్రదాయ బద్ధంగా పందిరి రాటతో అంకురార్పణ చేసి దేవస్థానం అధికారులు, పూజారు శ్రీకారం చుట్టారు. దశమి ఘడియల్లో అమ్మవారి ప్రధాన దేవాలయం చదురుగుడి, లమ్మవారు బెస్తలకు లభించిన వనంగుడి వద్ద ఆదివారం ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పందిరిరాటకు పసుపు, కుంకుమలు, పూలు అలంకరించి వార్షిక సిరిమాను ఉత్సవాలకు తొలిఘట్టం క్రతువును భక్తుల నడుమ నిర్వహించారు. పందిరిరాట అనంతరం అమ్మవారు కలలో ఆలయ ప్రధానపూజారి తాళ్లపూడి భాస్కరరావుకు కలలో అమ్మవారు కనిపించి ఆమె ఆదేశాను సారం విజయనగరం మండలం ధర్మపురి గ్రామంలో సిరిమాను వృక్షాన్ని గుర్తించారు. ధర్మపురి గ్రామానికి చెందిన రైతులు గొల్లపల్లి వెంకటరమణ, గొల్లపల్లి ఆదినారాయణల కల్లంలో సుమారు 60 అడుగుల సిరిమానును కనుగొన్నారు. అదేవిధంగా సిరిమానుకు అనుసంధానంగా వినియోగించే ఇరుసుమానును బాలి పెంటయ్య అనే రైతు పొలంలో గుర్తించారు. మంచి ముహూర్తం నిర్ణయించి అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలిచి దర్శించే సిరిమానును త్వరలో పూజారి నివాసం ఉండే హుకుంపేటకు తరలిస్తామని ఆలయ పూజారి వెల్లడించారు. ఈ ఏడాది అమ్మవారి సిరిమాను ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తుల, జిల్లా యంత్రాంగం సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ భానురాజా ఆదివారం తెలిపారు.
చిత్రం.. పైడితల్లి అమ్మవారు