లక్ష్య సాధనలో వెనుకబడొద్దు
Published Monday, 26 September 2016తిరుపతి, సెప్టెంబర్ 25: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం గొప్ప లక్ష్యాలతో ఏర్పాటు చేసిందని, ఆ దిశగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం వేదిక్ వర్శిటీని సందర్శించిన ఆయన ఆచార్యులతో సమావేశమయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద వర్శిటీలో పరిశోధనలు ఆశించినంతగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదాలు భారతీయ సంపద అన్నారు. అలాంటిది నేడు ఆ విద్యను పొరుగు దేశాలు సద్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. మన వేద సంపదను సద్వినియోగం చేసుకోవడంలో జరుగుతున్న జాప్యం పట్ల తనకు కొంత అసంతృప్తి ఉందన్నారు. వేదాల్లోని విజ్ఞానం ప్రజలకు అర్థమయ్యేలా చేయగలిగినపుడే వేద వర్శిటీలో పరిశోధనలకు ఒక సార్థకత చేకూరుతుందన్నారు. వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు కాగితాలపై పట్టాలిచ్చినంత మాత్రాన వేదాలకు సార్థకత చేకూరదన్నారు. వేద విజ్ఞానం సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. వేద వర్శిటీలో విధులు నిర్వహిస్తున్నామని సరిపెట్టుకోవద్దని, తా ను చెప్పిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా వేద వర్శిటీ అధికారులు దృష్టిసారించాలని హితవు పలికారు.
వర్షాలను సమర్థవంతంగా
ఎదుర్కొన్న టి.సర్కారు
తిరుచానూరు: గత పది రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ప్రభుత్వం కూడా వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సహాయ సహకారాలను అందించడంలో ముందుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా హైదరాబాద్లో వర్షాలు కురిశాయన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో సహా పోలీసులు, రెవెన్యూ, ఆర్మీ అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాయన్నారు. ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే నివసించాలని గవర్నర్ సూచించారు.