అమరావతిలో ఇక ఆర్బిఐ కార్యాలయం!
Published Monday, 26 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్ర రాజధాని అమరావతిలో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. ఈ మేరకు తాను పంపిన వినతిపత్రంపై స్పందించి ఆర్బిఐ లేఖ పంపిందని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. తాను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, ఆర్బిఐ గవర్నర్ను కలిసి అమరావతిలో ఆర్బిఐ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోనే ఆర్బిఐ ఉందన్నారు. దీని వల్ల ఆంధ్ర ప్రభుత్వంతో పాటు ఆర్బిఐతో ఆర్ధికపరమైన లావాదేవీలు ఉన్న సంస్ధలు, బ్యాంకులు హైదరాబాద్కు రావాల్సి ఉంటుందన్నారు. 13 జిల్లాల్లోని అన్ని బ్యాంకుల బ్రాంచిలు ఆర్బిఐ లైక రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లోని ఆర్బిఐ చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నారు. తాను ఇచ్చిన వినతిపత్రంపై స్పందించి ఆర్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రదీప్ లేఖ పంపారన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆర్బిఐ ఏర్పాటు కోసం స్ధలాన్ని కేటాయించే విధంగా సిఆర్డిఏకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.