చెరువులకు జలకళ..పంటలకు జీవం
Published Monday, 26 September 2016మోత్కూరు, సెప్టెంబర్ 25: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావం వల్ల గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల మోత్కూరు మండలంలోని మోత్కూరు పెద్ద చెరువు, పాలడుగు పెద్ద చెరువు, కొండగడప జంట చెరువులు, దాచారం, ధర్మారం, దత్తప్పగూడెం, రేపాక(డి), పాటిమట్ల, కోటమర్తి, అడ్డగూడూరు చెరువులు నిండి నిండు కుండలా తొణికిస లాడుతూ అలుగు పోస్తున్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసి నప్పటికి మెట్టపంటలకు వరి పంటలకు జీవం పోసినట్లు అయింది. మండలంలో సాగు చేసిన వరి, పత్తి,కంది పంటలు జీవం పోసుకొని కళకళ లాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వరణుడు ముఖం చాటేయడంతో కొంత మేర వర్షాలు పడినప్పటికి కురువ వలసిన వర్షాలు కురియక పోవడంతో చెరువులల్లోకి చుక్క నీరు చేరక పోవడం వల్ల ఈ సంవత్సరం నీటి కరువు తప్పదా అనుకున్న సమయంలో వర్షాలు పడడం వల్ల కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగు చేసిన రైతుల ముఖాల్లో ఆనందం కలిగిస్తుంది. ఈ వర్షాలవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.