మరణం (సండేగీత)
Published Saturday, 12 November 2016ఎంత వయస్సు వచ్చినా, నడవడం కష్టంగా వున్నా చావాలని ఎవరూ కోరుకోరు. మరణం దానంతట అదే రావాలి. కానీ కొంతమందిని మరణం సులువుగా పలకరిస్తుంది. మరి కొంతమందిని చాలా ఇబ్బంది పెడ్తుంది. వాళ్లనే కాదు వాళ్ల పిల్లలని కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే పెద్దవాళ్లు తరచూ ఒక మాట అనేవాళ్లు. ఎవరితో సేవ చేయించుకోకుండా మరణించాలని. కాని ఇది ఎవరి చేతిలోనూ లేదు. మరణం ఎందుకు కొంతమందిని వేధిస్తుందో, బాధిస్తుందో అర్థంకాదు.
ఓ మిత్రుడి తండ్రి విషయం చెబుతాను. వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు. అందరిలో ఇతను చాలా చలాకీగా ఉండేవాడు. అరవై సంవత్సరాలు దాటిన తరువాత ఏదో తెలియని జబ్బు వచ్చింది. ఏదీ గుర్తుండదు. అప్పుడప్పుడూ అన్నీ గుర్తుకొస్తాయి. అట్లా పది సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికీ పోలేడు. ఎవరితో ఏమీ మాట్లాడలేడు. ఈ మధ్య కాలకృత్యాలు తీసుకోవడం కూడా కష్టమవుతోంది. అందరికీ కష్టంగానే ఉంటుంది. మరణం అతన్ని వేధిస్తోంది. అతనితో ఆడుకుంటోంది. అతని తమ్ముడు ఈ మధ్య మూడవ అంతస్తు కట్టిస్తున్నాడు. అక్కడ నీళ్లు సరిగ్గా పడుతున్నారా లేదా అని చూస్తూ పైకి వెళ్లి జారి పడ్డాడు. అంతే! వెంటనే మరణించాడు. అతని మరణాన్ని ఎవరూ ఊహించలేదు. అతనూ ఊహించం లేదు. కానీ అతన్ని మరణం పలకరించింది. అతని అన్నకి డెబ్బై సంవత్సరాలు దాటాయి. తీవ్రమైన అనారోగ్యం. అందరూ అతని మరణాన్ని ఊహిస్తున్నారు. కానీ అతన్ని మరణం పలకరించలేదు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది.
మరణం గురించి ఓ కవయిత్రి చాలా గొప్పగా చెప్పింది. మరణం ఎలా రావాలో వివరించింది. ఆ కవిత ఇలా కొనసాగుతుంది.
పిలవగానే కువకువలాడుతూ
పెంపుడు పావురంలా
భుజంపై వచ్చి వాలాలి.
టికెట్టు కొనుక్కున్న రైలుబండిని
సకాలంలో అందుకున్నట్టు
నిదానంగా అన్నీ సర్దుకొని నింపాదిగా ఎక్కాలి.
పూర్తిగా చదివేసిన పుస్తకాన్ని
జాగ్రత్తగా మడిచిపెట్టి మననం చేసుకున్నట్టు
మనస్ఫూర్తిగా మనశ్శాంతితో వెళ్లిపోవాలి.
నిస్సవ్వడిగా మట్టిలో ఇంకిపొయ్యే బిందువులా
మాగిపోయి మార్దవంగా నేలరాలే పండులా
కాలం ఒడిలోకి జర్రున జారిపోవాలి జీవం.
మరణం ఎలాంటి శబ్దం చేయకుండా మంటిలో ఇంకిపొయ్యే బిందువులా రావాలి. మాగిపోయి మార్దవంగా నేలరాలే పండులా రావాలి. ఈ ప్రపంచంలో అట్లాంటి అదృష్టవంతులు ఎవరు...?