ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత
Published Friday, 18 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు డిపాజిట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నగదు ప్రవాహం వెల్లువెత్తడంతో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ సహా పలు ప్రధాన బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో రానున్న కొద్ది రోజుల్లో ఇతర వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. 390 రోజుల నుంచి రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించామని, ఈ వడ్డీ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమలులోకి వచ్చిందని ఐసిఐసిఐ బ్యాంకు తన వెబ్సైట్లో ప్రకటించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పటివరకూ 7.25 శాతం వడ్డీ పొందిన ఖాతాదారులకు ఇకమీదట 7.10 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసిఐసిఐ బ్యాంకు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంకు కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల మధ్య అన్ని రకాల కాల పరిమితులు కలిగిన బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. ఈ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటును గురువారం నుంచే అమలులోకి తీసుకొస్తున్నామని హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకటించింది. ఏడాది కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పటివరకూ 7 శాతంగా ఉన్న వడ్డీని 6.75 శాతానికి, మూడేళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75 శాతం నుంచి 7.50 శాతానికి తగ్గించినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు స్పష్టం చేసింది. అలాగే ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంకు కూడా ఎంసిఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు)ను 0.15 శాతం నుంచి 2 శాతం వరకు తగ్గించింది.
కాగా, ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎంపిక చేసిన కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బుధవారంమే 0.15 శాతం తగ్గించింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన ప్రకటించిన నాటి నుంచి బుధవారం వరకు బ్యాంకులు గత వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించగా, వీటిలో ఎస్బిఐ ఒక్కటే 1,14,139 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించింది.