అవసరం తెలుసుకుని ఇచ్చేవాడే భగవంతుడు: పవన్కల్యాణ్
Published Friday, 18 November 2016కాచిగూడ, నవంబర్ 17: అడిగితే ఇచ్చేవాడు భగవంతుడు కాదని, అవసరం తెలుసుకుని ఇచ్చేవాడు భగవంతుడని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. భక్తిటివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి గురువారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి భగవంతుడంటే ఎంతో భయమని తెలిపారు. తనకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయడం రాదని అన్నారు. 15 రోజుల పాటు కోటి దీపోత్సవం నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. కార్తీక మాసంలో వెలుగిస్తున్న దీపాలు ప్రతి ఒక్కరికీ ఆయూరారోగ్యాలను కల్పించాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామి సుఖబోధానంద, స్వామి హరిచైతన్యపూరీజీ అనుగ్రహ భాష్యం చేస్తూ కోటి దీపోత్సవం ఒక ఉత్సవంలాగా కొనసాగుతోందని కొనియాడారు. ఒకే వేదికపై వేలమంది భక్తులచే పూజలు చేయించడం ఎంతో అశ్చర్యన్ని కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరారు. కోటి దీపోత్సవంలో ముందుగా శ్రీహరిహర స్మార్థ వేద పాఠశాల వారిచే వేదపఠనం చేశారు. కార్తీక మాసం విశిష్టతను వివరిస్తూ బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి భక్తులను ఉద్ధేశించి ప్రవచనలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చౌకీలపై భక్తులచే గణపతికి కోటి గరిక అర్చనతో పాటు కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక స్వామివారికి కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిపించారు. అనంతరం కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక స్వామి వారిని మూషిక వాహనంపై ఘనంగా ఊరేగించారు. త్యాగరాయ మ్యూజిక్ కాలేజి బృందం, జల తరంగిణి సోమయాజులు బృందంచే భక్తి గీతాలుతో పాటు విద్యార్ధులు ప్రదర్శించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అకర్షించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్వామి సుఖబోధానంద, స్వామి హరిచైతన్యపూరీజీ కార్తీక దీపారాధనలో పాల్గొన్నారు.