బెదిరించి చోరీలు
Published Friday, 18 November 2016ఖైరతాబాద్, నవంబర్ 17: బెదిరించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను సంజీవరెడ్డినగర్ (ఎస్ఆర్నగర్) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం పంజాగుట్ట ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. యూసఫ్గూడ జవహర్నగర్కు చెందని ఎస్.కే. నాసర్ (24), బోయిన సాంబరాజు (19), రహమత్నగర్కు చెందిన బాలసాని కోటేశ్వరరావుతో పాటు మైనర్ బాలుడు కలిసి జట్టుగా ఏర్పడ్డారు. వీరు ఫ్లెక్సీ బ్యానర్లు కడుతూ జీవనం కొనసాగిస్తుంటారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ పలువుర్ని భయపెట్టి చోరీలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల అమీర్పేట, మధురానగర్లో నాడీ జోతిష్యుడు శంకర్జీ వద్దకు వెళ్లి అతనిపై కత్తితో దాడి చేసి మూడున్నర తులాల బంగారు చైన్తో పాటు రెండు సెల్ఫోన్లను చోరీ చేశారు. ఇదే తరహాలో రాజ్నగర్లోని ఓ ఇంటికి వెళ్లి వ్యభిచారం జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయని వారిని బెదిరించి కొంత నగదు, ఒక సెల్ఫోన్ చోరీ చేసుకొని వెళ్లిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సార్నగర్ క్రైం పోలీసులు డిఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. మధురానగర్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోనికి తీసుకొని విచారించగా వారు చేసిన చోరీల చిట్టా విప్పారు. దీంతో ముగ్గురు దొంగలను రిమాండ్కు తరలించి, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కు తరలించారు. వీరి వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్ని పట్టుకోవడంలో చకచక్యంగా వ్యవహరించిన డిఐ సతీష్తో పాటు సిబ్బందిని ఏసిపి అభినందించారు. భయాందోళనకు గురిచేసి చోరీ చేస్తున్న ప్రధాన నిందితుల ఇద్దరిపై పిడియాక్ట్ నమోదు చేయాలంటూ ఉన్నతాధికారులను కొరనున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సార్నగర్ సిఐ వాహీదుద్దీన్, సబ్ ఇన్స్పెపెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.