మంచినీటి పైప్లైన్ నిర్మాణంలోసమన్వయం
Published Friday, 18 November 2016హైదరాబాద్, నవంబర్ 17: శివారు మున్సిపల్ సర్కిల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు రూ.1900 హడ్కో రుణంతో అభివృద్ధి పనులు చేపడుతొంది జలమండలి. ఈ పనులను వివిధ ప్యాకేజీల కింద విభజించి పనులు చేపడుతోంది. శివార్లలోని 12 మున్సిపాల్టీలను గ్రేటర్ వీలినం చేసిన ప్రభుత్వం తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగు పర్చేందుకు జలమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో పనులు చేపడుతోంది. నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో నీటిని నిల్వచేయడం కోసం 56 రిజర్వాయర్లను నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికి నల్లా కనెక్షన్లో భాగంగా ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో నీటి పైప్లైన్, రిజర్వాయర్ల నిర్మాణం పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. శివారు మున్సిపల్ ప్రాంతాల్లోని గ్రామాల్లో నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు జలమండలి దాదాపు 2700 కిలోమీటర్లు మేర నీటి పైప్లైన్ నిర్మాణం కోసం తవ్వకాలను చేపడుతోంది. ప్రధానంగా 600 కిలోమీటర్లు విస్తీర్ణంలో భారీ పైప్లైన్ నిర్మాణం పనులు చేపడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం ప్రారంభించిన జలమండలి ప్రాజెక్ట్ విభాగం అధికారులు నీటి పైప్లైన్ ఏర్పాట్ల కోసం వివిధ ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జలమండలి ఎండి ఎం.దానకిషోర్, జిహెచ్ఎంసి కమిషనర్ బి.జనార్ధన్రెడ్డి సమక్షంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నాతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో గురువారం పైప్లైన్ త్వకాలపై సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో జిహెచ్ఎంసి, జలమండలి, మెట్రో రైలు, ట్రాఫిక్ పోలీస్, టిఎస్ఎస్ ట్రాన్స్కో, బిఎస్ఎన్ఎల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచినీటి పైప్లైన్ చేపట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరు శాఖల అధికారులు చర్చించారు. రోడ్ల తవ్వకాల విషయంలో జిహెచ్ఎంసి, మెట్రో రైలు, ట్రాఫిక్, ట్రాన్స్ తిదితర శాఖల సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న జలమండలి ఎండి ఎం.దానకిషోర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ మరమ్మతు పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న తరువాతే తవ్వకాల పనులు జరుపుతారన్నారు. అనుమతుల తీసుకున్న ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టడానికి కావాల్సిన అంచనాలు త్వరగా రూపొందించి, టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను సిద్ధంగా ఉంచాలని కోరారు. ఆ తరువాతే పైప్లైన్ తవ్వకాలు జరిపిన వెంటనే మరమ్మతులు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల తవ్వకాలు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల తవ్వకాల విషయంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసి కమిషనర్ బి.జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ పైప్లైన్ల కోసం కిలోమీటర్ల మేర ఒకేసారి తవ్వకాలు జరిపితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తవ్వకాలు జరిపి దానిని పూడ్చిన ఆ తరువాత మళ్లీ పనులు కొనసాగించాలని అన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి వర్షకాలంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తోందని, అలాంటి ప్రాంతాల్లో మ్యాన్హోల్ ఎత్తు పెంచాలని జలమండలి అధికారులకు కమిషనర్ సూచించారు. దీంతో మ్యాన్హోల్ పూడిపోకుండా మురుగునీటి పారుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఎల్లస్వామి, డి.శ్రీ్ధర్బాబుతో పాటు జిహెచ్ఎంసి, ట్రాన్స్కో తదితర శాఖలకు చెందిన ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.