రైతులకు లాభాలు చేకూర్చేందుకే సెంట్రో ఎక్స్లెన్సీలు
Published Friday, 18 November 2016జీడిమెట్ల, నవంబర్ 17: రైతులకు లాభాలు చేకూర్చేందుకే సెంట్రో ఎక్స్లెన్సీలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జీడిమెట్ల పైపులైన్ రోడ్డులోని సెంట్రో ఎక్స్లెన్సీ సెంటర్ను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్రెడ్డితో కలిసి మంత్రి సందర్శించి అందులోని మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జీడిమెట్లలో 10ఎకరాల్లో సెంట్రో ఎక్స్లెన్సీ సెంటర్ను నిర్మిస్తున్నామని తెలిపారు. కూరగాయలు, పూలు, మొక్కలు పెంచేందుకు ఈ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రూ.12కోట్ల ఖర్చుతో సెంటర్లో నర్సరీలు, పాలిహౌస్, సేల్డెట్ హౌస్, మొక్కలు పెంచేందుకు హాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. నెలకు 6 నుండి 7లక్షల మొక్కలు పెంచే కెపాసిటీతో సెంటర్ నిర్మాణం జరుగుతుందని, సంవత్సరానికి 70- 72 లక్షల నర్సరీలు పెంచి రైతులకు సబ్సిడీపై అందించే అవకాశం ఈ సెంటర్ ద్వారా ఉందని తెలిపారు. సెంటర్లోని నర్సరీలు ఆరోగ్యకరంగా ఉన్నాయని అన్నారు. సెంటర్ను ప్రయోగాత్మకంగా తయారుచేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 24 సెంటర్లు ఉన్నాయని, రాష్ట్రంలో రైతాంగానికి లాభం చేకూర్చే కూరగాయలు, పూలు, పళ్ల పంటలతో రైతులకు అధికలాభాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకుని ఈమూడు రకాల పంటలను ఎక్కువగా పండించే రైతులకు శిక్షణఇచ్చే ఏర్పాట్లను చేస్తామని చెప్పారు.
సెంటర్ను త్వరలోనే ఆచరణలోకి, అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నర్సరీలో క్యాప్సికమ్ ఎరుపు, పసుపు రంగుల్లో పెరుగుతున్నాయని, వీటి ధర మార్కెట్లో అధికంగా ఉంటుందని అన్నారు. రైతాంగానికి లాభాలను అందించే పంటలను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.