డిటెన్షన్ దెబ్బకు జెఎన్టియు విద్యార్ధుల గింగిర్లు
Published Friday, 18 November 2016హైదరాబాద్, నవంబర్ 17: జెఎన్టియు గత ఏడాది నుండి అమలుచేస్తున్న డిటెన్షన్ దెబ్బకు ఫస్టియర్ విద్యార్ధులు గింగిర్లు తిరిగారు. చాలా సంవత్సరాలుగా డిటెన్షన్ విధానం సెకండియర్, థర్టు ఇయర్, ఫోర్తు ఇయర్ విద్యార్ధులకు మాత్రమే అమలులో ఉండగా, ఫస్టియర్ విద్యార్థులకు అమలుచేయడం లేదు. అయితే గత ఏడాది నుండి జెఎన్టియు ఫస్టియర్ విద్యార్ధులకు సైతం డిటెన్షన్ అమలుచేస్తోంది. 2015లో చేరిన విద్యార్ధులు 2016 మార్చిలో పరీక్షలు రాశారు. 48వేల మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 11,199 మంది ఫెయిల్ అయ్యారు. 56 క్రెడిట్లకు కనీసం 28క్రెడిట్లు జమ అయితేనే వారిని ఫస్టియర్ నుండి సెకండియర్కు పంపించాలని యూనివర్శిటీ నిబంధనలు చెబుతున్నాయి. దాని ప్రకారం 11,199 మంది ఫెయిల్ అయినట్టు అధికారులు ప్రకటించారు. దానిపై విద్యార్ధుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో వారికి సప్లిమెంటరీ పరీక్షలను వెనువెంటనే నిర్వహించి ఫలితాలను ఇస్తే క్రెడిట్లు చేరి సెకండియర్కు ప్రమోట్ చేయవచ్చనే యోచన అకడమిక్ సెనేట్లో వ్యక్తమైంది. దాంతో యూనివర్శిటీ మరోమారు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, మూడు వారాల్లోనే ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాల్లో 5620 మంది ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ సెకండియర్లో ప్రమోషన్ కల్పించారు. మిగిలిన 5579 మంది విద్యార్ధులు సరిపడా క్రెడిట్లను పొందకపోవడంతో వారిని ఫస్టియర్లోనే కొనసాగించారు. ఈఏడాది వారు ఫస్టియర్ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించనిదే రానున్న రోజుల్లో వారికి ఇబ్బంది అవుతుందని యూనివర్శిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ పద్ధతి మిగిలిన యూనివర్శిటీల్లో కూడా అమలులో ఉందని వారు చెప్పారు.