సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలి
Published Friday, 18 November 2016విజయవాడ, నవంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు చేరవేయడంలో ప్రజాప్రతినిధులు తమవంతు కర్తవ్యం నెరవేర్చాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. గురువారం జలవనరుల శాఖ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, జన్మభూమి కమిటీలు, నీటి సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ రైతుల సాగుకు అందించే నీటి వసతి దగ్గర నుండి సంక్షేమ కార్యక్రమాల వరకు జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మైలవరం నియోజకవర్గంలో పనులు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం, వారికి తెలిసేలా చేయటం స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత అని మంత్రి తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో భాగమైన జక్కంపూడి కాలనీలో రూ.55 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఒక్కరోజులోనే జక్కంపూడి కాలనీలో ముఖ్యమంత్రి చేత కాలేజీ మంజూరు చేయించామని తెలిపారు. రైతు రుణమాఫీ మైలవరం నియోజకవర్గ పరిధిలో రూ. 61.31 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 4,909.80 కోట్లతో 4.80 ఎకరాల నీటి వసతి కల్పిస్తున్నామన్నారు. వనం - మనం కింద నియోజకవర్గంలో రూ.4.26 కోట్లతో 1.2 లక్షల మొక్కలు నాటామని, ఎన్టీఆర్ గృహ పథకం కింద రూ.25.75 కోట్లతో 1600 గృహాలు కట్టించామని, రోడ్డు రవాణా కింద రూ.4.86కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.8కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి రూ.81.19 కోట్లు కేటాయించామని, పుష్కరాలకు రూ.50 కోట్లతో నియోజకవర్గం పరిధిలోని పవిత్ర సంగమం, తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేశామని మంత్రి ఉమ వివరించారు. విజయవాడ సబ్ కలెక్టర్ సలోని సిదానా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల చేరవేతలో అధికారుల్లో నిర్లక్ష్యం కూడదన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, డిఆర్డిఏ పీడీ, సోషల్ వెల్ఫేర్ జెడి, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.