అనుమతిపత్రాలు అందజేత
Published Friday, 18 November 2016పెదనందిపాడు, నవంబర్ 18: ఎన్టిఆర్ గృహనిర్మాణ పథకం కింద మండల పరిధిలో నూతనంగా గృహాలను నిర్మించుకోనున్న పలువురు లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక ఎండిఒ కార్యాలయంలో ఎంపిపి నగరాజకుమారి అనుమతి మంజూరు పత్రాలను అందజేశారు. మండలానికి 250 గృహాలు మంజూరైనట్లు చెప్పారు. 45 రోజుల్లో ప్రారంభించి 185 రోజుల్లో గృహనిర్మాణం పూర్తిచేయాల్సి ఉందని లబ్ధిదారులకు సూచించారు. లక్షా 50 వేల రూపాయలను ప్రభుత్వపరంగా ఇంటి నిర్మాణానికి అందజేస్తున్నట్లు చెప్పారు. కాగా ఖేల్ ఇండియా గ్రామీణ ప్రాంత ఆటల పోటీలను శనివారం పెదనందిపాడులో నిర్వహిస్తున్నట్లు ఇఒపిఆర్డి రజనీకుమారి తెలిపారు.
మరుగుదొడ్లపై ప్రచారం ఆర్భాటమే
అచ్చంపేట, నవంబర్ 18: మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రచార ఆర్భాటాలకు క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుకు పొంతన లేకుండా పోయిందని సిపిఎం డివిజనల్ కార్యదర్శి అనుముల లక్ష్మేశ్వరరెడ్డి ఆరోపించారు. సిపిఎం పెదకూరపాడు డివిజన్ కమిటీ చేస్తున్న పాదయాత్రలు 5వ రోజు మిట్టపాలెం, పెదపాలెం, ఆర్ఆర్ సెంటర్, నీలేశ్వరపాలెం, తాళ్లచెరువు గ్రామాల్లో జరిగాయి. పెదపాలెం, మిట్టపాలెం గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటామని చెప్తున్నా అధికారులు స్పందించడం లేదని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పెదపాలెం ఎస్సీలు ఉపాధి పనులు చూపించడం లేదన్నారు. ఆర్ఆర్ సెంటర్లో చేసిన ఆరు నెలల ఉపాధి పనులకు నగదు చెల్లించలేదని ఆరోపించారు. పాదయాత్రలో జిల్లా కమిటీ సభ్యులు అజయ్కుమార్, రవిబాబు, వై వెంకటేశ్వర్లు, మధుసూధనరావు, వై ఫ్రాన్సిస్ ఎ చైతన్య, తదితరులున్నారు.