తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా
Published Friday, 18 November 2016గుంటూరు, నవంబర్ 18: అధికారం కోసం మరోమారు అధికార పార్టీ నేతలు అధర్మమార్గాన్ని ఎంచుకున్నారని, తాజాగా నగరపాలక సంస్థ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో బిఎల్ఒలను అడ్డుపెట్టుకుని గందరగోళానికి తెరలేపారని ఆరోపించారు. శుక్రవారం ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిని కలిసి ముసాయిదా ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులను ఆధారాలతో సహా అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ నాగలక్ష్మి సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలంటే భయబ్రాంతులకు గురవుతున్న టిడిపి నాయకులు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని ఆరోపించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఒకే కుటుంబంలోని ఓటర్లు వేరు వేరు పోలింగ్ బూత్లలో ఓటర్లుగా నమోదు కాగా, కొన్ని చోట్ల వేరు వేరు డోరు నెంబర్లతో నమోదు చేశారన్నారు. బూత్ లెవల్ అధికారులు అధికార పార్టీ నేతల ప్రలోబాలకు తలొగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. కమిషనర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే ముస్త్ఫా, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు, కిలారి రోశయ్య, వెంకటకృష్ణ, యేరువ నర్సిరెడ్డి, సాల్మన్, అబిద్, పడాల సుబ్బారెడ్డి, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.