వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి
Published Saturday, 19 November 2016జూలూరుపాడు, నవంబర్ 18: వ్యవసాయ రంగాన్ని పరిరక్షిస్తేనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మా అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార పోస్టర్లను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనం, పరపతి, సౌకర్యం, నీటి పారుదల, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయరంగాన్ని వెంటాడుతున్నాయని అన్నారు. వీటన్నింటిని ప్రభుత్వం అభివృద్దిపరచినప్పుడే వ్యవసాయరంగం పురోగతి సాధిస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చాక అమలు పరచటంలో చిత్తశుద్ధి చూపటంలేదని ఆరోపించారు. పర్యవసానంగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రాజ్యమేలటంతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. కనీసం నకిలీలను అరికట్టేందుకు కూడా ప్రభుత్వాలు కనీస చర్యలు చేపట్టక పోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. చివరకు అంతంతమాత్రంగా వచ్చిన దిగుబడులు సాధించిన పంటలను తీరా అమ్ముకునే సమయంలో మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులను మరింత కుంగదీస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుని రైతులను రక్షించే నినాదంతో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో రైతు సంఘ నాయకులు బాదావతు రాంబాబు, సోలీ, కొర్రా వీరూ, చందర్, తులిశ్యా, వాడ వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.