సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు
Published Saturday, 19 November 2016మునగపాక, నవంబర్ 18: రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, వైకాపా ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి - పూడిమడక ప్రధాన రహదారిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. వైకాపా నేతలు ప్లేకార్డులు చేతపట్టి మెయిన్రోడ్డులో ప్రదర్శనగా వచ్చి స్థానిక పిఎసిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పిఎసిఎస్ సిఇఒ నాగేశ్వరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనాలోచిత నిర్ణయం వలన సామాన్య ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార బ్యాంకులకు లావాదేవీలు నిలిపి వేయాలని రిజర్వ్బ్యాంక్ ఆదేశాలు ఇవ్వడంతో రైతు లు ఎరువులు విత్తనాలు, పురుగు మందులు విక్రయించడానికి వస్తే పాతనోట్లు చెల్లవని రైతులను తిరిగి పంపేస్తున్నారని, అలాగే బంగారు రుణాలపై తీసుకున్న రుణాలు చెల్లించడానికి వస్తే పాతనోట్లు చెలమణి కావని వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురుచేస్తున్నారని ఆరోపించారు. నోట్లు మార్పిండి జరిపించి రైతులకు ఎరువులు యదాతదంగా అమ్మకాలు జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రసాద్ హెచ్చరించారు. స్థానిక పిఎసిఎస్ సిఇఓ డిసిసిబి అధికారులతో మాట్లాడి ఎరువులు అమ్మకానికి పాతనోట్లు తీసుకుంటామని భరోసా పలకడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా ఫ్రదాన కార్యదర్శి మళ్ల నాగసన్యాసిరావు, దాసరి అప్పారావు, వైకాపా నేతలు టెక్కలి కొండలరావు, మళ్ల సంజీవరావు, నరాలశెట్టి సూర్యనారాయణ, బొడ్డేడ శ్రీనివాసరావు, శరగడం జగన్నాథరావు, ఇళ్లనాగేశ్వరావు, ముత్యాల భాస్కరావు, ఎ రమణబాబుస బొడ్డేడ అప్పలనాయుడు, మళ్ల కృష్ణ, టెక్కలి రమణబాబు, కాండ్రేగుల సీతారాము, దాడి పోలీస్, వేగి లక్ష్మణరావు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.