‘జడ్జిల రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రతిపాదన లేదు’
Published Saturday, 19 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 18: ఉన్నత న్యాయస్థానాల జడ్జిల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి శుక్రవారం రాజ్యసభలో ఈ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు, 24 హైకోర్టుల న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంపునకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. జడ్జిల రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లుకాగా, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లుగా ఉంది. న్యాయమూర్తుల నియామక వయోపరిమితి 45 నుంచి 42 ఏళ్లకు తగ్గిస్తారన్న కథనాలను మంత్రి తోసిపుచ్చారు.