పౌరసరఫరాల శాఖ సంగారెడ్డి జిల్లా మేనేజర్పై వేటు
Published Saturday, 19 November 2016హైదరాబాద్, నవంబర్ 18: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పౌర సరఫరాల సంస్థ సంగారెడ్డి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. సంగారెడ్డితో పాటు మెదక్ జిల్లా ఇన్చార్జ్గా కూడా ఆయన ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అయినందుకు చర్య తీసుకున్నారు. హైదరాబాద్లో పని చేస్తున్న లక్ష్మీనారాయణను కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సంగారెడ్డికి బదిలీ చేశారు. ఆయన నెల రోజుల్లో రెండు రోజులు మాత్రమే మెదక్ జిల్లాలో పర్యటించారు. ఖరీఫ్ ధాన్యసేకరణ ఏర్పాట్లను సైతం పట్టించుకోలేదు. గురువారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆయన దృష్టికి ఈ విషయం తీసుకు వచ్చారు. చైర్మన్ ఆదేశంతో సంస్థ ఎండి సివి ఆనంద్ లక్ష్మీనారాయణను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.