అమిత్షా సభకు పంచెలతో!
Published Saturday, 19 November 2016భీమవరం, నవంబర్ 18: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న రైతు సభను వినూత్నంగా నిర్వహించడానికి పార్టీ నేతలు కృషిచేస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొనే ఈ సభకు హాజరయ్యే వారంతా పంచెలు ధరించి హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సుమారు లక్షమందిని ఈ సభకు హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు భావిస్తున్న సంగతి విదితమే. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకు ప్రాంతాల వారీగా తరలింపు తప్పనిసరి. అలా తరలించే వారు తప్పనిసరిగా పంచె ధరించి, సభకు హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నారు. రైతు సభగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు వచ్చేవారంతా పంచెలతో వస్తే సంప్రదాయబద్ధంగా ఉంటుందని పార్టీనేతల యోచనగావుంది. గతంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన అమిత్షా బహిరంగ సభకు త్రివర్ణ చీరలు ధరించిన మహిళలు హైలైట్గా నిలిచారని, మీడియాలో కూడా ఆ అంశానికి ప్రచారం బాగా వచ్చిందని, ఈ నేపథ్యంలోనే రైతు సభకు హాజరయ్యేవారంతా పంచెలు ధరించి వస్తే సరికొత్తగా ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నట్టు సమాచారం.