కారు-ఆటో ఢీ: ఒకరు దుర్మరణం
Published Saturday, 19 November 2016మదనపల్లె, నవంబర్ 18: జనచైతన్య యాత్రలకు వెళ్తున్న ఎమ్మెల్సీ కారు, మదనపల్లె నుంచి తిరుపతిరోడ్డులో ప్యాసింజర్లతో సిటిఎంకు వెళ్తున్న షేర్ఆటో ఢీకొంది. ఈఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఎమ్మెల్సీ ఎన్ నరేష్కుమార్రెడ్డితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ రవిప్రకాష్ కథనం మేరకు మదనపల్లె పట్టణం గొల్లపల్లెవీధి విజయనగర్ కాలనీకి చెందిన పి బాలాజి(19) షేర్ ఆటో నడుపుతున్నాడు.అయితే శుక్రవారం తన స్నేహితుడు ఎం భానుప్రకాష్(19) ఆటోడ్రైవింగ్ చేస్తుండగా పక్కనే బాలాజీ కూర్చుకుని ఉన్నాడు. ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని మదనపల్లె నుంచి సిటిఎంకు బయలుదేరారు. జనచైతన్యయాత్రకు బయల్దేరిన ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి వస్తున్న వాహనం తట్టివారిపల్లె చెరువుకట్ట వద్ద షేర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయి బోల్తాపడింది. ఎమ్మెల్సీ వాహనం చెరువుకట్ట పక్కనే ఉన్న ముళ్ళపొదల్లోకి దూసుకెళ్ళింది. ఆటోలో ఉన్న బాలాజి(19) అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాష్కు తలకు బలమైన గాయాలైయ్యాయి. కారులో పయనిస్తున్న ఎమ్మెల్సీకి తలపై గాయం కాగా, గన్మెన్ మునిప్రసాద్కు చేతివేలు విరిగింది.