ఆధార్ తరహాలో ఐఆర్సిఎస్ కార్డులు
Published Saturday, 19 November 2016విశాఖపట్నం, నవంబర్ 18: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉన్నట్టే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ(ఐఆర్సిఎస్) కార్డు కలిగి ఉండేలా చూడాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో జరిగిన ఉత్తమ సేవా అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసుపత్రులు, యోగా సంస్థ, పాఠశాలల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలని, సామాజిక కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని, విపత్కర పరిస్థితుల్లో మానతాదృక్పథంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. రక్తదాతల కోసం మేమున్నామంటూ రెడ్క్రాస్ సభ్యులు భరోసానివ్వాలన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఐఆర్సిఎస్ సభ్యుల సంఖ్య మరింత పెరగాలని సూచించారు. తరచూ ఆసుపత్రులను సందర్శిస్తూ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలన్నారు. ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని సూచించారు. ముందుగా ఐఆర్సిఎస్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గంలో విశ్రాంత సీనియర్ ఐఎఎస్ అధికారి రేచల్ ఛటర్జీని చైర్ పర్సన్గా, జస్టిస్ లక్ష్మణరావు, ఎన్ రమేష్కుమార్లను ఉపాధ్యక్షులుగా, సీనియర్ ఐఎఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనంతరం రక్తంలో రేఖా మాత్రంగా ఉండే ఇన్ఫెక్షన్ను గుర్తించే ‘నాట్’ పరికరాన్ని ఆయన ప్రారంభించారు.
మరో రెండు నాట్ పరికరాలను రక్తనిధి కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. అనంతరం 25 లక్షలతో ఏర్పాటు చేసిన 25 కెవి సౌర విద్యుత్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికార్లు, కలెక్టర్లకు గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో 201 మంది అధికారులకు బంగారు పతకాలు, 17 సేవా పతకాలు, 9 ఫీల్డ్లను అందజేశారు. అలాగే కర్నూల్ ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆయన కుమార్తె దీక్షిత రచించిన ‘సేవ్ చైల్డ్ గర్ల్’పాటల సీడీని గవర్నర్కు అందజేశారు.
కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి హరిప్రీత్ సింగ్, రెడ్క్రాస్ నూతన చైర్ పర్సన్ రేచల్ఛటర్జీ, విశాఖ కలెక్టర్ ప్రవీణ్కుమార్, పోర్టుట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు, విశాఖ రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు పి వేణగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు రెడ్క్రాస్ అవార్డును ప్రదానం చేస్తున్న గవర్నర్ నరసింహన్