డిసిసిబి ఉద్యోగుల నిరసన ప్రదర్శన
Published Saturday, 19 November 2016విజయనగరం (్ఫర్టు), నవంబర్ 18: గ్రామస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్న సహకార కేంద్ర బ్యాంకులలో 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి లావాదేవీల నిలుపుదలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడ ఉమామహేశ్వరరావు అన్నారు. కేంద్రం రద్దు చేసిన పెద్దనోట్ల నగదు మార్పిడి లావాదేవీలను సహకార బ్యాంకులలో నిలుపుదల చేయాలని రిజర్వు బ్యాంకు ఆదేశాలు జారీ చేయడం దారుణమని అ న్నారు. నగదు మార్పిడి లావాదేవీల ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రి జర్వు బ్యాంకు ఆదేశాలను నిరసిస్తూ బ్యాంకు ప్రధాన కార్యాలయంవద్ద శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులపై ప్రేమ కనబర్చుతున్న రిజర్వు బ్యాంకు గ్రామస్థాయిలో రైతుల సేవలో నిమగ్నమైన సహకార కేంద్ర బ్యాంకుల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. సహకార కేంద్ర బ్యాంకులలో నగదు మార్పిడి లావాదేవీలను నిలుపుదల చేయడంవల్ల రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. మిగతా బ్యాంకుల కంటే సహకార బ్యాంకులలోనే రైతులకు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. సహకార కేంద్ర బ్యాంకులలో తక్షణమే పెద్దనోట్ల రద్దు ఆదేశాలను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.