విజయావకాశాలు సజీవం
Published Sunday, 20 November 2016విశాఖపట్నం: చివరి రెండు రోజులు తమకు పరీక్షా సమయమని, దీనిని సవాలుగా తీసుకుంటామని ఇంగ్లాండ్ వికెట్కీపర్-బ్యాట్స్మన్ జానీ బెయర్స్టో అన్నాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడాడు. ఇప్పటికి తమ అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. మ్యాచ్పై పట్టు సాధించాలంటే నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాట్స్మెన్ను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. పిచ్ రోజుకో విధంగా మారుతూ వస్తోందని, తొలిరోజు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని అన్నాడు. బంతి ఎక్కువగా బౌన్స్ కావడం లేదన్న విషయాన్ని గుర్తుచేశాడు. ఏదేమైనప్పటికీ తాము తమ సహజసిద్ధమైన ఆటకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తాను చాలా ప్రాక్టీస్ చేశానని, అది తనకు ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ చేసి జట్టుకు సహకారం అందించడానికి ఉపయోగపడిందని అన్నాడు.
పట్టు సాధిస్తాం: జయంత్ యాదవ్
మిగిలిన రెండు రోజుల ఆటపై డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటామని, దానికి తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించుకుని ఆటపై పట్టు సాధిస్తామని కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న భారత జట్టు బౌలర్ జయంత్ యాదవ్ అన్నాడు. మ్యాచ్కి ముందు, మ్యాచ్ ఆడే సమయంలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఇస్తున్న సూచనలు తనకెంతో ఉపయోగపడుతున్నాయని చెప్పాడు. సాధ్యమైనన్ని ఎక్కు వ వికెట్లు పడకొట్టడం, బ్యాటింగ్లోనూ రాణించి, నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు చేయడం తన లక్ష్యమని పేర్కొన్నాడు.