ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్
Published Sunday, 20 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 19: నాలుగు లోక్సభ స్థానాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అసోంలోని లఖింపూర్, మధ్యప్రదేశ్లోని షాదోల్, పశ్చిమ బెంగాల్లోని కూచ్బిహార్, తామ్లుక్ లోక్సభ స్థానాలకు, తమిళనాడులో మూడు, త్రిపురలో రెండు, అసోం, అరుణాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు జరిగాయి. లఖింపూర్ లోక్సభ స్థానంనుంచి ఎన్నికయిన సర్బనంద సోనోవాల్ గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం పరిధిలోని మజులి అసెంబ్లీ స్థానంనుంచి ఎన్నిక కావడంతో లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనితో పాటుగా బైతలంగ్సో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నికల్లో 61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లోని రెండు లోక్సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 81 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్లోని షాదోల్ లోక్సభ స్థానంతో పాటుగా నేపానగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోను భారీగానే పోలింగ్ నమోదయింది. షాదోల్ నియోజకవర్గంలో 62.71 శాతం, నేపానగర్లో 71.25 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో అక్కడ మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడం విశేషం. కాగా, ఈరోజు ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ఫలితాలు ఈ నెల 22న వెల్లడి అవుతాయి.