శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులు గురుకుల్కు తీవ్ర అస్వస్థత
Published Sunday, 20 November 2016శ్రీకాళహస్తి, నవంబర్ 19: శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు బాబు గురుకుల్(78) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చెన్నయ్లో ఆసుపత్రికి ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న బాబు గురుకుల్ ఈనెల 16న అనారోగ్యంతో చెన్నయ్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. మెదడు నరాలలో రక్త ప్రసరణ ఆగిపోయి మూడు చోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని డాక్టర్లు ధ్రువీకరించారు. ఒక చోట శస్తచ్రికిత్స చేశారు. వైద్యానికి ఆయన శరీరం సహకరించడం లేదని డాక్టర్లు చెపుతున్నారు.ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారని డాక్టర్లు చెపుతున్నారు. వెంటిలేటర్ అమర్చిన ఆయన్ని శనివారం సాయంత్రం చెన్నయ్ నుంచి శ్రీకాళస్తిలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. కెమికల్ ఇంజినీరింగ్ చేసిన బాబు గురుకుల్ విశాఖపట్నంలో ఓ కంపెనీలో కొన్నాళ్లు పనిచేశారు. అయితే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 35 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తీశ్వరాల ప్రధాన అర్చకుడి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు చేయడం, ఉత్సవాల్లో ప్రధాన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రతి రోజు సాయంత్రం జరిగే మహాదీపారాధనకు ఆయన విధిగా హాజరయ్యేవారు. ఇదిలావుండగా గురుకుల్ మృతి చెందారని శ్రీకాళహస్తిలో వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన చివరి కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని శ్రీకాళహస్తికి తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు మాత్రమే స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు చేయడానికి అర్హులు. గురుకుల్కు సంబంధించిన వారినే ప్రధాన అర్చకునిగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. భరద్వాజ మహర్షి గోత్రానికి సంబంధించిన గురుకుల్ను ఆలయ ప్రధాన అర్చకులుగా దేవస్థానం నియమిస్తుంది.