ప్రైవేట్ రూముకు జయ
Published Sunday, 20 November 2016చెన్నై, నవంబర్ 19: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరో గ్యం పూర్తిగా కుదుటపడింది. దాదాపు రెండు నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్న జయలలిత శనివారం ప్రైవేటు గదికి మారారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సి.ఆర్. సరస్వతి విలేఖరులకు చెప్పారు. ‘మేం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వార్డుకు బదిలీ అయ్యారు. ఆరోగ్యకర జీవితాన్ని తిరిగి ప్రారంభించారు.’ అని ఆమె వివరించారు. ఈ వార్త విన్న వెంటనే అన్నాడిఎంకె కార్యకర్తలు ఆసుపత్రి ఆవరణలోనే మిఠాయిలు పంచుకున్నారు. డాన్సులు చేశారు. తమకు ఈరోజే దీపావళి అని బాణాసంచా కాల్చారు. జయలలిత సాధారణ ఆహారాన్ని తీసుకుంటున్నారని అపోలో చైర్మన్ పిసి రెడ్డి పేర్కొన్నట్లు సరస్వతి వివరించారు. అమ్మ కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.