కోతులనడుమ వద్ద రోడ్డు ప్రమాదం
Published Sunday, 20 November 2016ఎల్కతుర్తి/ హుజురాబాద్, నవంబర్ 19: ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్లోని కాకతీయ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గూడ కరుణాకర్రెడ్డి (44) అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ నుండి హన్మకొండ వైపు కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కరుణాకర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, బస్సులో ప్రయాణిస్తున్న మరో పది మందికి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా ములుగు ఘన్పూర్ మండలం సీతారాంపూర్ ఆయన స్వగ్రామం కాగా, ఆయన హన్మకొండ లష్కర్ బజార్లో నివాసముంటున్నాడు. ఆయన భార్య అనుమాండ్ల స్రవంతి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. వీరికి కుమార్తె హర్షిణి (11), కుమారుడు మహేశ్వర్రెడ్డి (14) ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్కతుర్తి ఎస్ఐ వెంకట రంగయ్య సూరి తెలిపారు.