సబ్స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు
Published Sunday, 20 November 2016పటన్చెరు, నవంబర్ 20: పటన్చెరు పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు మొదలైనాయి. నిరంతరము కరెంట్ కోతతో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల ఇక్కట్లు తీర్చడానికి అధికారులు సన్నద్ధమైనారు. చైతన్యనగర్లోని చైతన్య ప్రైవేటు పాఠశాల ప్రక్కన గల ప్రభుత్వ స్థలాన్ని దీని కోసం ఎంపిక చేసారు. నాలుగు రోజుల క్రితం జిఎచ్ఎంసి అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి స్థల పరిశీలన చేసారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ దిశగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసారు. కరెంట్ నిరంతర సరఫరాకు మరో కేంద్రం అవసరమని అధికారులు సూచించడంతో ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించడం జరిగిందన్నారు. నిధుల మంజూరిలో ఎలాంటి ఇబ్బంది లేనందున్ఘ సబ్స్టేషన్ నిర్మాణం సాధ్యమైనంత తొందరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి పట్టణ ప్రజలు అనునిత్యం ఎదుర్కుంటున్న కరెంట్ కష్టాల నుండి విముక్తి కలిగించాలని కోరారు. ఇప్పటి వరకు పటన్చెరు, రామచంద్రాపురం పట్టణాలకు కలిపి బండలగూడలో ఒకటే విద్యుత్ స్టేషన్ ఉంది. రామచంద్రాపురం పరిధిలో ఉన్న అనేక కాలనీలకు ఇక్కడి నుండే విద్యుత్ సరఫరా అవుతుండడమే కాకుండ పటన్చెరు ప్రాంత వాసులు సైతం దీనిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీనితో ప్రతిరోజు సరఫరాలో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. పటన్చెరు పట్టణవాసుల నిమిత్తం మరో సబ్స్టేషన్ అవసరమని ఎప్పడి నుండో ప్రజలు కోరుతున్నారు. దీనితో ఆదిశగా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు సాగించిన ప్రయత్నాలు ఫలించాయి. పట్టణంలో సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైనాయి.