ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
Published Sunday, 20 November 2016గజ్వేల్, నవంబర్ 20: భగవన్నామ స్మరణతోనే మానవుడికి మానసిక ప్రశాంతత దక్కుతుందని, ఎంతో చరిత్ర, మహాత్మ్యం కలిగిన వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి దాతల సహకారం ఎంతోఅవసరమని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి తీర్థ స్వామిజీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వర్గల్ క్షేత్రం వద్ద కార్తీక దీపోత్సవంలో భాగంగా కార్తీక జ్యోతిని వెలిగించిన అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కార్తీక జ్యోతి మానవుడి జీవితంలో వెలుగులు నింపుతుందని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని పరమేశ్వరుడి స్మరణతో సర్వ రోగాల నుంచి విముక్తిని పొందాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, వేద పండితులను గౌరవించే సమాజం ఎప్పుడూ బాగుంటుందని, అసూయ, రాగ ద్వేషాలకు దూరంగా ఉంటూ ఆనందమయ జీవితం గడపాలని స్వామిజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రొద్దుటూరి రాజులుగుప్త, టేకులపల్లి రాంరెడ్డి, వేద పండితులు అనంతగిరిశర్మ, శశిదర శర్మ, మురళీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.