శ్రీకాళహస్తి ఆలయ ప్రధానార్చకుడు బాబూ గురుకుల్ కన్నుమూత
Published Monday, 21 November 2016శ్రీకాళహస్తి, నవంబర్ 20: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకుడు ఎస్ఎంకె బాబుగురుకుల్ (78) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటిలేటర్పై ఉంచి ప్రత్యేక వాహనంలో శనివారం రాత్రి శ్రీకాళహస్తిలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. వెంటిలేటర్ తీసిన కొంత సమయానికి ఆదివారం తెల్లవారుజామున శుభగడియల్లో ఆయన కన్నుమూశారు. కాగా ముక్కంటీశునికి ఆయన దశాబ్దాల తరబడి పూజలు చేస్తూ అందరి మన్ననలు పొందారు. ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి. ఆయన మృతికి సంతాపసూచకంగా ఉదయం నుంచి ఆలయాన్ని మూసివేశారు. దేవస్థానం తరఫున అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, సభ్యులు, ఇఓ భ్రమరాంబ అందజేశారు. దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ శాంతారాం పవార్, మాజీ ఎంపిపి హరినాథరెడ్డి, మాజీ ఎంపి చింతా మోహన్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు.
నేటినుంచి భక్తులకు దర్శనం
ముక్కంటీశుని ఆలయ ప్రధానార్చకుడు బాబు గురుకుల్ మృతిచెందిన నేపథ్యంలో ఆదివారం ఆలయాన్ని మూసివేశారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత పూజారులు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి దర్శనం యధావిధిగా ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.