పట్టాల్లో పగుళ్లే ప్రమాదానికి కారణమా?
Published Monday, 21 November 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/21t2_1.jpg?itok=_ixckJTD)
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాన్పూర్ వద్ద సంభవించిన రైలు ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు అనంతరమే నిర్ధారణ కానున్నప్పటికీ ప్రాథమికంగా అందిన సమాచారాన్నిబట్టి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమయి ఉండవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లా పుఖ్రయాన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో వందమందికి పైగా మృతి చెందగా, మరో 150 మంది గాయపడిన విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటుగా పట్టాల చుట్టూ, అడుగున కంకర లాంటి వాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పట్టాలకు పగుళ్లు ఏర్పడి ఉంటాయని, అందువల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా శతాబ్ది ఎక్స్ప్రెస్లాంటి వాటిలో ఉండే ఆధునిక లింకీ హాఫ్మాన్ బుష్ సిస్టమ్(ఎల్హెచ్బి) ఉండే బోగీలు ఈ రైలుకు లేకపోవడం వల్ల కూడా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఎల్హెచ్బి సిస్టమ్తో ఉన్న కోచ్లయితే హటాత్తుగా సంభవించే తీవ్ర ఒత్తిడులను తట్టుకోగలిగి ఉండేవని, బోగీలు ఒకదానిని మరొకటి ఢీకొని ఉండేవి కావని, ఫలితంగా మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని వారంటున్నారు.
చిత్రం.. ప్రమాదానికి కారణమైన పట్టాలు