సిఎంలతో మాట్లాడండి
Published Monday, 21 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దు మరింత సమర్థంగా అమలు కావటంతోపాటు సగటు మనిషి ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిసింది. చంద్రశేఖరరావు నిన్న నరేంద్ర మోదీని ఆయన అధికార నివాసంలో కలుసుకుని పెద్ద నోట్ల రద్దు విజయవంతం కావాలంటే అనుసరించవలసిన విధానం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించటం తెలసిందే. దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అదుపు చేసేందుకు తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కొందరు ముఖ్యమంత్రులు సమర్థిస్తుంటే మరికొందరు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ఈ పథకం విజయవంతం కావాలంటే ముఖ్యమంత్రులందరి సహకారం అవసరం ఉంటుందని చంద్రశేఖరరావు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రులందరు ఈ పథకానికి మద్దతు ఇస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి నీతిఆయోగ్ లేదా మరో సంస్థ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రశేఖరరావు ప్రధానమంత్రికి సూచించినట్లు తెలిసింది.