రూ. 6 కోట్ల సిగరెట్ల లోడు అపహరణ
Published Monday, 21 November 2016సబ్బవరం, నవంబర్ 20: విశాఖపట్నం జిల్లాలో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను దొంగలు అపహరించుకుపోయారు. సబ్బవరం మండలం, దేవీపురం సమీపంలోని భీశెట్టినగర్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్ఐ తోట మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి. హైదరాబాద్కు కంటైనర్లో సిగరెట్లు లోడు వేసుకుని భోపాల్కు చెందిన డ్రైవర్ మహమ్మద్ అక్రమ్ఖాన్(27) శుక్రవారం కోల్కతా నుంచి బయలుదేరాడు. కంటైనర్ భీశెట్టినగర్ వద్దకు వచ్చేసరికి మరో లారీలో ఎనిమిది నుంచి పది మంది దొంగలు వెనుక నుంచి కంటైనర్ను ఓవర్టేక్ చేసి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. డ్రైవర్ను గుడ్డలతో కాళ్ళు, చేతులు కట్టేశారు. అంతేకాకుండా కంటైనర్, లారీని దొంగలే నడుపుకుంటూ అనకాపల్లి మండలం పరిధిలోని దాడి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై నిలిపేసి, కంటైనర్లోని విలువైన సిగరెట్లను తమ లారీలోకి లోడ్ చేశారు. అక్కడి నుంచి డ్రైవర్ను కింద తోసేసి పరారయ్యారు. కంటైనర్ డ్రైవర్ స్థానిక పోలీసులకు ఆదివారం తెల్లవారు జామును ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనకాపల్లి డిఎస్పి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.