ఘనంగా కార్తీక వన భోజనం
Published Monday, 21 November 2016తిరుపతి, నవంబర్ 20: తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఆదివారం కార్తీక వనభోజనం ఘనంగా జరిగింది. సర్వాలంకరణ భూషితుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై కొలువుదీరి ముందుభాగాన కదులుతుంటే, వెనుక పల్లకిపై శ్రీదేవి, భూదేవిలు మందగమనంతో స్వామిని అనుసరించారు. వాహన మండపం నుంచి బయలుదేరిన స్వామిని భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పార్వేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు, టిటిడి అధికారులు కార్తీక వనభోజనంలో పాల్గొన్నారు. కాగా కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది.