ఈసారీ బిజెపికి ఓటుతో పాటు నోటు
Published Monday, 21 November 2016హైదరాబాద్, నవంబర్ 20: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమ పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేస్తారని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి పోయిన దేశ ప్రజలు 1977 సంవత్సరంలో జనతా పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేశారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నదని ఆయన చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు, ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నల్లకుబేరులు మాత్రం డీలా పడ్డారని ఆయన తెలిపారు. పాక్ నకిలీ కరెన్సీని అరికట్టడం జరిగిందని అన్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు, కూలీ పనులు చేసుకునే వారికి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే అయినా ప్రజలు మోదీకి మద్దతుగా నిలిచారని, వారందరికీ తల వంచి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం రహస్యంగా జరగలేదని, అయితే ముందే తెలిస్తే, నల్లధనం ఉన్న వారు అప్రమత్తం అవుతారని జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు. దేశంలో 2 లక్షల 2 వేల ఎటిఎంలు ఉండగా, అందులో 40 వేలు పని చేయడం లేదని అన్నారు. లక్షా 55 వేల పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడి జరుగుతున్నదని ఆయన తెలిపారు.
నేడు ప్రధానితో భేటీ
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి వివరిస్తానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమై చర్చిస్తానని ఆయన తెలిపారు. మొబైల్ ఎటిఎం వ్యాన్లను తీసుకుని రావాలని దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానిని కలిసి సలహాలు, సూచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఇదే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీదే విజయం అని ఆయన ధీమాగా చెప్పారు. త్వరలో 500, 200 నోట్లు రాబోతున్నాయని ఆయన తెలిపారు.
చిత్రం.. హైదరాబాద్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి దతాత్రతేయ