దక్షిణ మధ్య రైల్వేకు వికాస్ శిబిర్ అవార్డు
Published Monday, 21 November 2016హైదరాబాద్, నవంబర్ 20: దక్షిణ మధ్య రైల్వేకు ‘రైల్ వికాస్ శిబిర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆదివారం న్యూఢిల్లీలోని సూరజ్కుండ్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అందుకున్నారు.
రైల్వే రంగంలో గణనీయమైన ప్రగతి సాధించేందుకు కీలక విభాగాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆచరణీయమైన సలహాలను రైల్వే బోర్డు చైర్మన్ మొదలుకొని గ్యాంగ్మెన్ వరకు మొత్తం సంస్థలో దేశవ్యాప్తంగా అన్నిస్థాయిల్లో ఉన్న ఉద్యోగుల నుండి రాబట్టడానికి ప్రధాన చొరవతో ఈ నెల 18 నుంచి 20 వరకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్థికంగా గిట్టుబాటు అయ్యేలా 3ఎక్స్ మూడింతల పెద్దదిగా భారతీయ రైల్వేను మలచడం అన్న శీర్షికన దక్షిణ మధ్య రైల్వే దాని వ్యూహాలను, ఆలోచనలను, సలహాలను ఈ సదస్సుకు సమర్పించింది. ప్రస్తుతమున్న సరకు రవాణాకు ఉద్దేశించిన షెడ్లను రైల్వేయేతర సంస్థల నిర్వహణ భాగస్వామ్యంతో ఆర్థికంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తూనే, బహుళ ప్రయోజనాలను రాబట్టవచ్చని, అదే సమయంలో విశ్వసనీయమైన, సంతృప్తికర సేవలను అందించవచ్చని వివరించింది. దీనివల్ల సరుకు రవాణా రైళ్లను నిలిపే ప్రాంతాల సామర్థ్యం ఆరింతలు పెరుగుతుందని, ఐటి ఆధారిత పంపిణీ వ్యవస్థను సమన్వయం చేయవచ్చని, ట్రాఫిక్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని, పై ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ ఆలోచన అమలైతే భారతీయ రైల్వే నెట్వర్క్లో మరింత సరుకు రవాణా అవుతుందని, మరికొన్ని సరుకు రవాణా రైళ్లు అవసరమవుతాయని, అప్పుడు నెట్వర్క్ కూడా విస్తరించాల్సి ఉంటుందని రవీంద్రగుప్తా వివరించారు.