ప్రజా ప్రతినిధుల అనర్హతపై విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు
Published Saturday, 3 December 2016న్యూఢిల్లీ, డిసెంబర్ 2: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191లలోని నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. కాగా, కేంద్ర హోమియోపతి రీసెర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డెంగ్యూ,మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు తదితర వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నట్టు కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం నాడు లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016-17 సంవత్సరానికి 48 పరిశోధన చర్యలు తీసుకున్నట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. డెంగ్యూపై ప్రీ క్లినికల్ దశలో మూడు, క్లినికల్ దశలో ఐదు పరిశోధనలు ఉన్నట్టు సమాధానంలో తెలిపారు. హోమియోపతి రీసెర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2015-16 సంవత్సరంలో 20 పరిశోధనలు జరిగినట్లు తెలిపారు. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య డబుల్ డెక్కర్ రైలును నడపనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రాజెన్ గోహెన్ తెలిపారు. రాజ్యసభలో టిడిపి ఎంపీ టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.