ఇక మీరే సారథులు
Published Saturday, 3 December 2016న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారీ పరిమాణంలో ద్రవ్య రూపంలో నగదు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని బలమైన పునాదులు కలిగిన భారతావని ఆవిర్భావానికి..నగదు రహిత సమాజానికి సారధులు కావాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.పేదలు, మధ్యతరగతి ప్రజల కలలను వమ్ముచేసే అవినీతి మహమ్మారికి 21వ శతాబ్దంలో ఆస్కారమే ఉండకూడదని లైకెడిన్ డాట్కామ్లో రాసిన ఓ వ్యాసంలో ప్రధాని అన్నారు. అవినీతి వల్ల వృద్ధి మందగిస్తుందని ఫలితంగా దీని ప్రభావం ప్రజాభ్యున్నతిపైనా,అభివృద్ధిపైనా తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. అవినీతి, నల్లధనానికి మూలకారణం నగదు ద్రవ్య రూపంలో భారీ పరిమాణంలో అందుబాటులో ఉండటమేనని అన్నారు. ఈ జంట జాఢ్యాలను రూపుమాపే ఉద్దేశంతోనే గత నెల 8న 500,1000 కరెన్సీని రద్దు చేస్తూ తాను చారిత్రక నిర్ణయం తీసుకున్నానని మోదీ గుర్తు చేశారు. ఈ నిర్ణయం దరిమిలా తలెత్తిన గుణాత్మక పరిస్థితులను ఆసరా చేసుకుని దేశ యువత సరికొత్త మార్పులకు సారధులు కావాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలే ప్రధానమైన సమాజ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు.ఇలాంటి పరిస్థితులు ఎంతగా బలపడితే అంతగానూ అవినీతి, నల్లధనానికి ఆస్కారం లేని బలమైన సామాజిక పునాదులు దేశంలో శక్తివంతమవుతాయన్నారు. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లే అధికంగా వినియోగమవుతున్న సరికొత్త సమాజంలో మనం జీవిస్తున్నామని పేర్కొన్న మోదీ ఆహారం మొదలుకుని ఫర్నిజర్ కొనుగోలు వరకూ అన్ని వీటి ద్వారానే సాగుతున్నాయన్నారు. ఇవే కాకుండా ఆధునిక జీవతానికి అవసరమైన అన్నింటినీ కేవలం మొబైల్ ద్వారానే సాధించుకోవచ్చునని చెప్పారు.