అమరావతిని దేశంలో అగ్రగామిగా నిలపడమే బాబు ధ్యేయం
Published Saturday, 3 December 2016మార్కాపురం, డిసెంబర్ 2: నూతన రాజధాని అమరావతిని దేశంలో అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకు తాగు, సాగునీరు అందించి కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. ప్రస్తుతం నూతన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశంతోపాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు సిద్ధంగా ఉన్నారన్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది యువత నిరుద్యోగం నుంచి బయట పడతారని అన్నారు. త్వరలో పోర్టులు కూడా వచ్చే అవకశం ఉందని, సింగపూర్లో ఒక పోర్టు ఉంటేనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని, ఇక్కడ రెండు పోర్టులు వస్తే అభివృద్ధి పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలిపారు. యర్రగొండపాలెం - వగ్గంపల్లి వరకు రహదారి నిర్మాణానికి 250కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరిక మేరకు మార్కాపురం చెరువుకట్టను అభివృద్ధి చేసేందుకు 9.5కోట్ల రూపాయలు, అలాగే ఆర్టిఓ కార్యాలయం నుంచి పోలేరమ్మ ఆలయం వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి 10కోట్ల రూపాయలు విడుదలచేసినట్లు, మార్కాపురం నంచి కొచ్చర్లకోట వరకు రోడ్డు నిర్మాణానికి 10కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రజలు ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారం లేకున్నా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్న కందుల నారాయణరెడ్డి విజయానికి ప్రజలు సహకరించాలని మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. ఈకార్యక్రమంలో పార్టీ పరిశీలకులు ఇనుకొండ సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, మార్కెట్యార్డు చైర్మన్ డివి కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి పాలకమండలి అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.