బ్యాంకులపై ఆర్బిఐ కొరడా
Published Thursday, 28 July 2016ముంబయి, జూలై 27: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ).. మొత్తం 13 బ్యాంకులపై 27 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఫెమా నిబంధనలు, కెవైసి నియమాలను ఉల్లంఘించినందుకుగాను 13 ప్రభుత్వరంగ, ప్రైవేట్రంగ బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ, ప్రైవేట్రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్సహా మరో 8 బ్యాంకులకు నిబంధనలను సరిగ్గా అమలు చేయాలని గట్టిగా మందలించింది. ఓ ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి అందుకున్న వివరాల ప్రకారం నిరుడు అక్టోబర్, నవంబర్ నెలల్లో 21 బ్యాంకుల లావాదేవీలను ఆర్బిఐ పరిశీలించింది. ఈ క్రమంలో మార్గదర్శకాలు, సూచనలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన ఆర్బిఐ.. అందుకు బాధ్యులైన బ్యాంకర్లపై జరిమానాలతో విరుచుకుపడింది. ఇందులోభాగంగానే బ్యాంక్ ఆఫ్ బరోడాపై 5 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్పై 3 కోట్ల రూపాయలు, సిండికేట్ బ్యాంక్పై 3 కోట్ల రూపాయలు, యూకో బ్యాంక్పై 2 కోట్ల రూపాయలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్పై 2 కోట్ల రూపాయలు, అలహాబాద్ బ్యాంక్పై 2 కోట్ల రూపాయలు, కెనరా బ్యాంక్పై 2 కోట్ల రూపాయలు, ఇండస్ఇండ్ బ్యాంక్పై 2 కోట్ల రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్పై 2 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కోటి రూపాయలు, కార్పొరేషన్ బ్యాంక్పై కోటి రూపాయలు, ఆర్బిఎల్ బ్యాంక్పై కోటి రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్పై కోటి రూపాయల చొప్పున జరిమానా విధించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు హెచ్చరికలు జారీ చేసింది.