కింగ్ఫిషర్ బకాయిల కేసు వేలానికి రూ. 700 కోట్ల ఆస్తులు
Published Monday, 1 August 2016ముంబయి, జూలై 31: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని రుణపీడిత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బకాయిలను రాబట్టుకోవడంలో భాగంగా ఆ సంస్థకు చెందిన 700 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను వేలానికి వేస్తున్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్.. ఎస్బిఐతోసహా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. అయితే వాటిని చెల్లించడంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, దాని యజమాని మాల్యా విఫలమవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను ఇప్పటికే పలుమార్లు వేలం వేయగా, దానికి స్పందన కరువైనదీ విదితమే. అయినప్పటికీ మళ్లీ కింగ్ఫిషర్ హౌజ్తోపాటు సకల సౌకర్యాలు కలిగిన మాల్యా వ్యక్తిగత విమానాన్ని వేలం వేస్తున్నారు. ఆగస్టు 4న కింగ్ఫిషర్ హౌజ్, అందులోని ఫర్నీచర్, 8 కార్లనూ వేలానికి పెడుతున్నారు. హౌజ్ రిజర్వ్ ధరను 135 కోట్ల రూపాయలుగా, అలాగే ఒక్కో కారు ధరను 90,000-2.50 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎస్బిఐ క్యాప్ ట్రస్టీ ఆధ్వర్యంలో వేలం జరుగుతుంది. ఇక ఆగస్టు 18న మాల్యా ప్రైవేట్ జెట్ను వేలం వేస్తున్నారు. దీని రిజర్వ్ ధరను నిర్ణయించాల్సి ఉంది. పోయినసారి వేలంలో 152 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే 1.09 కోట్ల రూపాయలకు ఇవ్వాలని బిడ్ దాఖలైనది తెలిసిందే. అలాగే 25న కింగ్ఫిషర్ లోగోను, ‘ఫ్లై ది గుడ్ టైమ్స్’ ఉప శీర్షికనూ వేలం వేయనున్నాయి బ్యాంకులు. ఫ్లయింగ్ మోడల్స్, ఫన్లైనర్, ఫ్లై కింగ్ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైస్ తదితర ట్రేడ్ మార్కులను అమ్మేస్తుండగా, వీటి రిజర్వ్ ధర 330.03 కోట్ల రూపాయల నుంచి 366.70 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు. గోవాలోని కింగ్ఫిషర్ విల్లానూ వేలం వేయనుండగా, ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రుణాలు చెల్లించక ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులచే ప్రకటించబడిన మాల్యా.. విదేశాలకు పారిపోయినది తెలిసిందే. మాల్యాపై బ్యాంకులు కోర్టులను కూడా ఆశ్రయించగా, మనీలాండరింగ్ కేసులోనూ దర్యాప్తులు జరుగుతున్నాయి. కాగా, మాల్యాతో డీల్ నేపథ్యంలో డియాజియోపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కనే్నసింది.