ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ సురుజీ అస్తమయం
Published Sunday, 20 November 2016హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రముఖ్, 93 ఏళ్ల వృద్ధ సైద్ధాంతికవేత్త కె సూర్యనారాయణ శుక్రవారం అర్ధ రాత్రి బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం బెంగళూరులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉంచారు. సాయంత్రం చామరాజపేట శ్మశానవాటికలో అంతిమసంస్కారం నిర్వహించారు. సూర్యనారాయణను అందరూ సురుజీగా పిలుస్తారు. గత 70 సంవత్సరాల పాటు ఆయన ఆర్ఎస్ఎస్కు పలు హోదాల్లో సేవలు అందించారు.
1924 ఆగస్టు 20న కృష్ణప్ప, సుందరమ్మ దంపతులకు సూర్యనారాయణ జన్మించారు. 1942లో విద్యార్థి దశలోనే ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులై అందులో చేరారు. 1946లో బిఎస్సీ పూర్తి కాగానే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా నియమితులయ్యారు. కర్ణాటక నుండి ఆర్ఎస్ఎస్లో చేరిన తొలి ముగ్గురు ప్రచారక్లలో సూర్యనారాయణ ఒకరు. ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నరహరి సూర్యనారాయణ సోదరుడే. సోదరి రుక్మిణి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నత హోదాలో ఉన్నారు.
ప్రధాని దిగ్భ్రాంతి
సూర్యనారాయణ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. సూర్యనారాయణ అఖిల భారతీయ సేవా ప్రముఖ్గా కూడా చాలా కాలం పనిచేశారు. కర్ణాటక విభాగ్ ప్రముఖ్గా, తమిళనాడు ప్రాంతీయ ప్రచారక్గా తర్వాత దక్షిణాది రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్గా పనిచేశారు. అమెరికా, ట్రినిడాడ్, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, హాలండ్, నార్వే, కెన్యా, మలేసియా, సింగపూర్, నేపాల్ తదితర దేశాలలో ఆయన పర్యటించారు.
విశ్వ హిందూ పరిషత్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, ఆరోగ్య భారతి, సేవా భారతి తదితర ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో చాలా సన్నిహితంగా ఉంటూ సేవలు అందించారు. కన్ను మూసేనాటికి ఆయన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1969లో కర్ణాటకలోని ఉడిపిలో సంత్ సమ్మేళన్ను దిగ్విజయంగా నిర్వహించి అందరి దృష్టినీ ఆయన ఆకర్షించారు. సూర్యనారాయణ మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో సంతాపం వ్యక్తం చేశారు.